01-03-2025 07:35:59 PM
భీంగల్ (విజయక్రాంతి): భీంగల్ బస్టాండ్ లో తోపుడు బండ్ల మీద పండ్లు, కూరగాయలు విక్రయించే వ్యాపారులతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని సర్వసమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి అన్నారు. శుక్రవారం ఎస్సై మహేష్ తో కలిసి సర్వసమాజ్ కమిటీ హాల్ లో తోపుడు బండ్ల వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. బస్టాండ్ లో పండ్ల వ్యాపారులతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని వచ్చిన పిర్యాదుల మేరకు ప్రధాన వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను వివరించారు. కొందరు పండ్లు విక్రయించే వారు మహిళలతో అసభ్యకరంగా వ్యవహారిస్తున్నట్టు ద్రుష్టికి వచ్చిందని, అలాంటి వ్యాపారులు తీరు మార్చుకోవాలని సూచించారు.
తోపుడు బండ్ల కొరకు సర్వసమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్థలం ఏర్పాటు చేస్తామని సూచించారు. పండ్లు విక్రయించే తోపుడు బండ్లను ఒకే చోట ఉంచేందుకు ఏర్పాటు చేస్తామని, అందుకు వ్యాపారులు సైతం సహకరించాలని సూచించారు. రంజాన్ మాసం ఉన్నందున నెల రోజుల వరకు అవకాశం ఇవ్వాలని పండ్ల వ్యాపారులు కమిటీని కోరారు. వ్యాపారుల వినతి మేరకు నెల పాటు అవకాశం కల్పించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు సూచించారు. నెల వరకు అవకాశం ఇచ్చినప్పటికి ట్రాఫిక్ అంతరాయం కల్పించకుండా వ్యాపారాలు చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు బర్ల మోహన్, క్యాషియర్ కాపు కుమ్మరి హరీష్, రైటర్ పర్స నవీన్ కమిటీ సభ్యులు, పండ్ల వ్యాపారులు పాల్గొన్నారు.