19-04-2025 10:37:44 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..
మహదేవపూర్ (విజయక్రాంతి): నిర్దేశిత సమయానికి సరస్వతి పుష్కరాల పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం లోని కాళేశ్వరంలో మే నెలలో జరుగనున్న సరస్వతి నది పుష్కరాల ఏర్పాటు పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం పరిశీలించారు. మొదటగా విఐపి ఘాట్ వద్ద నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వాటర్ క్యూరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. విఐపి ఘాట్ వద్ద జరుగుతున్న ర్యాంపు, మరుగుదొడ్ల నిర్మాణం, సరస్వతి దేవి విగ్రహ ఏర్పాటుకు జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడి నుండి ప్రధాన ఘాట్ వద్దకు చేరుకొని ప్రధాన ఘాట్ వద్ద జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణం పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యుత్ శాఖ చేపట్టిన పనులను పరిశీలించి విద్యుత్ స్థంబాలు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. మే 15 నుండి 26 వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున తాత్కాలిక, ,శాశ్వత ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మి, కుమార్, డిపిఓ నారాయణ రావు, ఇరిగేషన్, విద్యుత్, పంచాయితీ రాజ్ ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.