యాదాద్రి గిరి ప్రదక్షిణలో వేలాదిగా భక్తులు
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 11 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. విష్ణుపుష్కరిణిలో స్నాన సంకల్ప ఆర్జిత సేవ పునరుద్ధరణ, అఖంఢ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. కొండపై రుషులు శ్రీమహావిష్ణువు పాదప్రక్షాళనతో ఆవిర్భవించినట్టు స్థల పురాణం గల విష్ణుపుష్కరిణిలో స్నాన మాచరిస్తే దీర్ఘరోగాలు నయమైతాయనే స్నాన సంకల్ప ఆర్జిత సేవను ఆలయ అర్చకులు పుష్కరిణి జలాలకు పూజలు చేసి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబసమేతంగా తొలిసారి స్నానమాచరించారు. అదే విధంగా పుష్కరిణి వద్ద అఖంఢ దీపం వెలిగించి స్నానం, దీపం అనే భక్తుల ఆధ్యాత్మిక సంకల్పాలనికి అవకాశం కల్పించారు. గిరిప్రదక్షిణలో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.