22-12-2024 01:36:54 AM
మహబూబ్నగర్, డిసెంబర్ 20(విజయక్రాంతి): ప్రభుత్వ స్థలంలో అక్రమ ఇసుక దందాకు ప్రయివేటు వ్యక్తులు దర్జాగా అంకురార్పణ చేశారు. ప్రభుత్వ స్థలాన్నే తమ వ్యాపారానికి అడ్డాగా చేసుకున్నారు. రాత్రి సమయంలో ఇసుకను డంప్ చేయ డం.. పగటి సమయంలో అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారు. దీంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఎక్కడో మండల కేంద్రంలో అనుకుంటే పొరపాటు పడినట్టే.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పరిశ్రమల శాఖ కార్యాలయంలోని పార్కు స్థలంలో ఆక్రమ డంపింగ్ ఇసుక వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమంగా ఇసుక ఎక్కడ డంపింగ్ చేసినా సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎక్కడో జనం తిరుగని ప్రాంతాల్లో డంపింగ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను విక్రయిస్తున్న దాఖాలా లను చాలావరకు జనం చూశారు. ఈ విషయం అధికారులకు తెలుసో తెలియదో అనే సందేహాంతో మనం ఏమి చేస్తాం అనుకున్న దాఖలాలు ఉన్నాయి.
అయితే జిల్లా కేంద్రంలోని పరిశ్రమల శాఖ కార్యాలయ పరిధిలో ఉన్న ఖాళీ భూమిపై ఇసుక వ్యాపారులు కన్ను వేశారు. చాలా రోజుల నుం చే రాత్రి సమయంలో ఇక్కడ ఇసుకను వాహనాల ద్వారా తీసుకువచ్చి డం పింగ్ చేస్తున్నారు. పగటి సమయంలో ట్రాక్టర్లతో పాటు ఇత ర చిన్న వాహనాలతో అవసరమైన వారికి ఇసుకను తరలిస్తున్నారు. అక్రమ ఇసుక డంపింగ్కు పార్కు స్థలం నిలయంగా మా రిందని, ఆధారాలతో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయికి న్యూప్రేమ్నగర్కు చెందిన ఎం. బాలరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
దర్జాగా డంపింగ్..
ఇసుక అక్రమ వ్యాపారం చేయాలంటే ఎవరైనా భయపడుతారు. రెవెన్యూ అధికారులతోపాటు పోలీసులు, మైనింగ్ అధికా రుల నిఘా నిరంతరం ఉంటుంది. అందరి కండ్లు కప్పి ఇసుకను తరలించాలంటే ఎన్నో వ్యయప్రయాసలు పడాలి. దీంతో కొందరు ఇసుక వ్యాపారులు వినూత్నంగా ఆలోచించి ప్రభుత్వ పార్కు స్థలాన్నే కబ్జా చేసి తమ వ్యాపారానికి కేంద్రబిందువుగా మార్చుకున్నారు.ఈ క్రమంలో ఇసుకను పార్కు స్థలంలోనే డంపింగ్ చేస్తున్నారు.
అక్కడ నుంచి దర్జాగా అవసరం ఉన్న వారికి తరలిస్తున్నారు. అయితే జిల్లా కేంద్రంలో అధికా రులు ఉన్నప్పటికీ ఈ దందాను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్కు స్థలంలో అక్రమ వ్యాపారం ఏమిటని న్యూప్రేమ్నగర్కు చెందిన బాలరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై అధికారులు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.