18-03-2025 12:42:04 AM
ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
టిజిఎండీసీ ఆధ్వర్యంలో ప్రారంభం
అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 17: ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలు చేరువలో ఉండాలని ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన ఇసుక అందించేందుకు ప్రజలకు స్యాండ్ బజార్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.
సోమవారం తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ తో కలిసి అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజలకు నాణ్యమైన ధరలు అందుబాటులో ఉండేందుకు సాండ్ బజార్ ను ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళారులు వారి ఇష్టానుసారం రేట్లు పెంచుతూ మోసాలకు పాల్పడుతున్నారని దీనిని గమనించిన ప్రభుత్వం సన్నా ఇసుకకు రూ.1800/-లకు అదే విధంగా దొడ్డు ఇసుకకు రూ.1600/-లకు చొప్పున ఆన్లైన్లో బుక్ చేసినట్లయితే వారికి ఇసుక పంపడం జరుగుతుందని తెలిపారు.
ఇక్కడ నుండి తీసుకెళ్ళే రవాణా చార్జి అదనంగా ఉంటుందని తెలిపారు. ఈ ఇసుక 365 రోజులు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూ ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా ఎక్కువ ధరకు అమ్మడాన్ని అరికట్టుటకు ప్రభుత్వం ధర నిర్ణయించిందని అన్నారు.
టిజిఎండిసి ద్వారా హైదరాబాద్ నగరానికి మూడు ప్రాంతాల్లో సాండ్ బజార్లను ఏర్పాటు చేసిందని అందులో మొదటిది అబ్దుల్లాపూర్ మెట్ ప్రారంభించుకున్నామని తెలిపారు. ప్రజలకు సులభతర పద్ధతిలో మైనింగ్ శాఖ సహకారంతో ఈ స్యాండ్ బజార్లను ఏర్పాటు చేస్తున్నారని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
దీనితో దళారులకు అవకాశం లేకుండా చట్టపరంగా అందరికీ తక్కువ ధరలకు ఇసుక లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిజిఎండీసీ ఎండి సుశీల్ కుమార్,ఎడి మైన్స్ నర్సిరెడ్డి, స్థానిక తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీ వాణి, బిల్డర్లు స్థానికులు, లారీ యజమాను తదితరులు పాల్గొన్నారు.