20-02-2025 01:17:16 AM
జగిత్యాల, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన సనాతన ధర్మమే మన మానవ మనుగడకు ఆధారమని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో శ్రీలింగ మహాపురాణ సప్తాహం బుధవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్ష, కార్యదర్శులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, పురాణ కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజు నాంది పూజ, గురు వందనం నిర్వహించారు. సప్తాహంలో భాగంగా మహేశ్వరశర్మ మాట్లాడుతూ వేదవ్యాస మహర్షి మానవ జాతికి అందించిన జ్ఞాన గనులే అష్టాదశ మహా పురాణాలన్నారు.
ప్రపంచంలో ఉన్న ప్రాచీన, ఆధునిక, ఇంకా కనుగొనబడని మరెన్నో విజ్ఞాన విషయాలన్నీ మన పురాణాల్లో, వేదాలలో దాగి ఉన్నాయన్నారు. అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో రెండవ ప్రయత్నంగా ప్రస్తుతం శ్రీలింగ మహాపురాణం వింటున్నామన్నారు. ఈ పురాణంలో సృష్టికి మూలం, లయకారుడైన ఆ మహా శివుని గురించి, శివ లీలల గురించి సవివరంగా చెప్పబడిందన్నారు.
జీవన గమనంలో నిత్యం మనకు ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే శక్తినిచ్చి, శుభాలను అనుగ్రహించే శుభకరుడే ఆ శంభుడు, శివుడు అని మహేశ్వరి శర్మ వివరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ గండ్ర దిలీప్’రావు, శక్కరి వెంకటేశ్వర్, నీలి కాశీనాథ్, భోగ శ్రీధర్, రాజలింగం, మహేష్, రమేష్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.