25-02-2025 12:00:00 AM
సమంత దక్షిణాదిని వీడి చాలా కాలమవుతోంది. ‘ఖుషి’ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరొక సినిమా సౌత్లో చేయలేదు. మయోసైటిస్ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటూ కొంతకాలం.. ఆపై వెబ్ సిరీస్లు చేస్తూ ముంబైలోనే కాలం గడిపేస్తోంది. ఇంతకాలం ఒక హీరోయిన్ సౌత్లో సినిమాలు చేయకుంటే ప్రేక్షకులు మరచిపోయి ఉండేవారు. కానీ సమంత విషయం సెపరేట్. ఇక్కడి ఆడియన్స్ ఈ అమ్మడిని మరిచిపోయే ప్రసక్తే లేదంటున్నారు.
ఆమె ఎప్పుడు సినిమా అనౌన్స్ చేస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్. తరచూ అభిమానులతో చిట్చాట్లు చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సరదాగా సమాధానమిచ్చింది. నెగిటివిటీని ఎదుర్కొనేందుకు ఏం చేస్తారని ఓ నెటిజన్ అడగ్గా.. మెడిటేషన్ వంటి రొటీన్ ఫార్ములానే ఫాలో అవుతానని చెప్పింది. మీకు నచ్చిన హీరోయిన్స్ ఎవరని అడగ్గా.. పెద్ద లిస్టే చెప్పింది. ‘
అమరన్’లో సాయిపల్లవి, పార్వతి తిరువోతు, ‘సూక్ష్మదర్శిని’లో నజ్రియా, ‘జిగ్రా’లో ఆలియా భట్, అనన్య పాండే అంతా తనకు నచ్చిన హీరోయిన్స్ అని చెప్పుకొచ్చింది. వీరంతా రాక్ స్టార్స్ అని కూడా సమంత ప్రశంసలు కురిపించింది. ‘మీరు తిరిగొచ్చేయండి బ్రో.. మిమ్మల్నెవరూ అడ్డుకోలేరు’ అని ఒక అభిమాని అనగా.. ‘తిరిగొస్తాను బ్రో’ అంటూ సమంత సమాధానమిచ్చింది.