స్వాధీనం చేసుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): నగరంలో నిషేధిత మందులను విక్రయిస్తున్న వ్యక్తిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. చిలకలగూడ రైల్వే పోలీస్ స్టేషన్ సమీపంలోని జన ఔషధి దుకాణంలో నిషేధిత ఆప్లోక్పాసిన్ మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు బీ గోవింద్సింగ్, జీ అనిల్, పీ రేణుక, ఎం సురేందర్ ఆదివారం దుకాణంపై దాడులు చేసి మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మందుల వినియోగం వలన మానసిక రుగ్మతలు కలుగుతాయని డ్రగ్ ఇన్స్పెక్టర్లు తెలిపారు. ఇలాంటి నిషేధిత మందులు ఎక్కడైనా విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే 18005996969 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి ప్రజలకు సూచించారు.