calender_icon.png 6 October, 2024 | 7:49 PM

కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు చెల్లించాలి

11-09-2024 01:23:38 AM

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన 

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు నెలల తరబడి  జీతాలు ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కింగ్ కోటి ఆసుపత్రిలో జరిగిన ధర్నాలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహా మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి టీవీవీపీ ఆసుపత్రుల కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయలేదని, దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టీవీవీపీ కమిషనర్‌కు, రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తులిచ్చినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిం దన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకున వేతనాలిచ్చే ప్రభుత్వం తమదని చెప్పే పెద్దలకు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు చెల్లించాలని తెలియదా అని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించకుంటే విధులను బహిష్కరించి సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.