calender_icon.png 26 October, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పల్లవి పలికేనా?

04-07-2024 12:05:00 AM

ఈ తరం కథానాయికల్లో తనకంటూ అభిమానులని సంపాదించుకున్న కథానాయిక సాయిపల్లవి. ఆమె ఏ సినిమాలో కనపడినా ఆ కథని, పాత్రని తమతో తీసుకుపోతారు. అంతలా తెలుగు సినీ ప్రియులపై ప్రభావం చూపిన సాయి పల్లవి ‘బుజ్జితలి’్లగా మరోమారు మైమరపింపజేయనుంది. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ ఈ ఏడాది తెరపైకి రానున్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన పాత్రలతో ఈ తరహా సినిమాలు చేస్తూనే, మరోవైపు ‘గార్గి’ వంటి నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తున్న ఆమెను తాజాగా అలాంటి ఓ కథ వెతుకుతూ వచ్చిందట.

‘ఓనమాలు’, ‘మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు’ సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు క్రాంతి మాధవ్ తర్వాతి చిత్రాలతో అంతగా మెప్పించలేకపోయారు. కొంత విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్న ఆయన, తనదైన శైలి సున్నిత అంశాలతో నాయికా ప్రాధాన్యం తో ఒక కథని సిద్ధం చేశారట. ఇందుకు సాయి పల్లవి సరైన ఎంపిక అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.

బాలీవుడ్‌లోనూ ఇప్పటికే రెండు సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి, దర్శకుడు క్రాంతి మాధవ్ పిలుపునకు ఎంతవరకు పలుకుతుందన్నది తేలాల్సి ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తగా దర్శకుడు మరో కథను కూడా సిద్ధం చేసుకున్నారట. యాక్షన్ జానర్‌లో ముస్తాబుచేసిన కథని నాగశౌర్య కథానాయకుడిగా పట్టాలెక్కించాలన్నది ఆయన ఆలోచన. ఈ రెంటిలో ఏది దర్శకుడిగా క్రాంతి మాధవ్ దిశ మార్చనుందో మరి!