హైదరాబాద్,(విజయక్రాంతి): ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, పౌర హక్కుల ఉద్యమకారుడు జీఎన్ సాయిబాబా(57) అనారోగ్యంతో నిజాం దవాఖానలో చికిత్స పొందుతు కన్నుముశారు. దీంతో సోమవారం పౌరహక్కులు, ప్రజాసంఘాల నేతలు, అభిమానులు మౌలాలి జవహర్ నగర్ నివాసంలో సాయిబాబా భౌతికకాయానికి నివాళులు అర్పించారు. సాయిబాబా భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు కుటుంబసభ్యులు ఇంట్లో ఉంచి, తర్వాత గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, కోదండరాం, సీపీఐ నారాయణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... జైలు నుంచి వచ్చిన కొన్నాళ్లకే సాయిబాబా మరణించడం బాధాకరం అని, సమాజంలో మార్పు, హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి.. సాయిబాబా అని పేర్కొన్నారు. హక్కుల కోసం పోరాడేవారిపై అక్రమ కేసులు పెట్టడం బాధాకారామన్నారు. సాయిబాబాపై కేంద్రం అణచివేత ధోరణితో వ్యవహరించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. సాయిబాబా మృతికి కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ మౌలిక సూత్రాల అమలు కోసం సాయిబాబా పోరాడారు. కానీ ప్రజాస్వామ్యవాదులంతా కలిసి సాయిబాబా నిర్భంధాన్ని ఖండించారని కోదండరాం తెలిపారు. జీఎన్ సాయిబాబా భౌతికకాయాన్ని ఆసుపత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన కళ్లను ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేస్తున్నట్లు చెప్పారు. సాయిబాబా భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని జవహర్నగర్కు తరలించారు. ఆత్మీయుల నివాళి అనంతరం భౌతికకాయన్ని ఆస్పత్రికి అందజేస్తామని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.