- క్వార్టర్స్లో ముచోవా చేతిలో ఓటమి
- సెమీస్ చేరిన జెంగ్ చైనా ఓపెన్
బీజింగ్: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ అరీనా సబలెంకాకు షాక్ తగిలింది. టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన సబలెంకా క్వార్టర్స్కే పరిమితమైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సబలెంకా (బెలారస్) 6-7 (5/7), 6-2, 4-6తో అన్సీడెడ్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం చవిచూసింది.
దాదాపు మూడు గంటల పాటు సాగిన మ్యాచ్లో తొలి సెట్ను టై బ్రేక్లో కోల్పోయిన సబలెంకా రెండో సెట్ను మాత్రం సునాయాసంగా కైవసం చేసుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో మాత్రం ముచోవా ముందు తలవంచిన సబలెంకా ఓటమి ఖరారు చేసుకుంది. మ్యాచ్లో ముచోవా 5 ఏస్లు సంధించగా.. సబలెంకా 3 ఏస్లు కొట్టినప్పటికీ మూడు డబుల్ ఫాల్ట్స్తో మూల్యం చెల్లించుకుంది.
ఇటీవలే యూఎస్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన సబలెంకా చైనా ఓపెన్లోనూ టైటిల్ కొల్లగొట్టాలనుకున్నప్పటికీ ముచోవా రూపంలో ఆమె కోరిక నెరవేరలేదు. మరో క్వార్టర్స్లో చైనా స్టార్ జెంగ్ 5-7, 6-0, 6-4 తేడాతో మిర్రా ఆండ్రీవా (రష్యా)పై నెగ్గి సెమీస్లో అడుగుపెట్టింది. తొలి సెట్ను ఆండ్రీవాకు కోల్పోయిన జెంగ్ రెండో సెట్ను మాత్రం ప్రత్యర్థికి ఒక్క పాయింట్ ఇవ్వకుండా గెలుచుకోవడం విశేషం.
ఇక నిర్ణయాత్మక మూడో సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ మ్యాచ్ జెంగ్వైపే మొగ్గింది. మ్యాచ్లో జెంగ్ 5 ఏస్లతో పాటు 9 బ్రేక్ పాయింట్లు సాధించింది. మరోవైపు ఒక్క ఏస్కే పరిమితమైన ఆండ్రీవా 4 డబుల్ ఫాల్ట్స్ నమోదు చేసింది. నేడు జరగనున్న తొలి సెమీస్లో పౌలా బడోసాతో కోకో గాఫ్, రెండో సెమీస్లో ముచోవాతో జెంగ్ తలపడనుంది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.