12-03-2025 12:48:57 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాం తి): తెలంగాణ చలనచిత్రాలకు ఇవ్వనున్న గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ అవార్డులకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జీవో విడుదల చేసింది.
తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలనందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని, ఇప్పటికే ప్రముఖనటులు ఎమ్ ప్రభాకర్రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలనచిత్రానికి అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2014 నుంచి 2023 వరకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను జారీ చేయకపోవడంతో, ఆ సంవత్సరాలకు కూడా ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలనచిత్రానికి అవార్డుఇవ్వాలని నిర్ణయించారు. ఫీచర్ ఫిలిం కేటగిరిలో మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది.
గద్దర్ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఏసీ గార్డ్స్ లోని తెలంగాణ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ గద్దర్ అవార్డులను ఈ కింది క్యాటగిరీల్లో ఇవ్వ డం జరుగుతుందని తెలిపారు.
ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై చలనచిత్రం, బాలల చలనచిత్రం, పర్యావరణం లేదా హెరిటేజ్ లేదా చరిత్రలపై చలనచిత్రం, డెబిట్ ఫీచర్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిలిం, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్తో పాటు తెలుగు సినిమాలపై బుక్స్ లేదా విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు లేదా టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.