హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరహారా దీక్షలు చేయనున్నట్లు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా... ట్రేడ్ యూనియన్లను శాశ్వతంగా రద్దు చేసే కుట్రకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
వెల్ఫేర్ కమిటీలను తిరిగి నియమించేందుకు ఆదేశాలు జారీ చేయడమంటే తమను మోసం చేయడమేనని వారు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం లేబర్ యూనియన్కు, యాజమాన్యానికి, ప్రభుత్వానికి అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగానే సామూహిక నిరాహార దీక్షలతో ఆందోళన చేస్తున్నామని వారు తెలిపారు.