28-04-2025 12:29:39 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): దేశంలోనే నంబర్ వన్ సంస్థగా ఆర్టీసీని మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం లక్డీకాపూల్లోని ఓ హోటల్లో జరిగిన టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐదో వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు.
దశల వారీగా పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం, కట్టుబడి ఉన్నదన్నారు. ఏడాది కాలంగా ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే కొత్త బస్సులు కొన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీపథకంతో ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టిని సాధిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సలహాలతో ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపట్టామన్నారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్ఫెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించారు. సమావేశంలో రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగవేందర్రావు, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, సెక్రటరీ విజయ్కుమార్, జాయింట్ సెక్రటరీ సీతరాంబాబు, ట్రెజరర్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.