ముగ్గురు మృతి
పరిగి, అక్టోబర్ 17: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ హైవేపై బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. పూడూరు మండలం మేడికొండ గ్రామానికి చెందిన నవీన్ (21), హర్షవర్ధన్ (15), గొంగుపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ (20) ముగ్గురు స్నేహితులు.
గురువారం ఉదయం ముగ్గురు కలిసి బైక్పై మేడికొండ నుంచి మన్నెగూడ వైపు వెళ్తున్నారు. పూడూరు గేటు సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన హైదరాబాద్కు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు.
నవీన్ వికారాబాద్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతుండగా, హర్షవర్ధన్ పట్టణంలోని వసతి గృహంలో ఉంటూ 9వ తరగతి చదువుతున్నాడు. నవీన్, హర్షవర్ధన్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి వచ్చిన కొడుకులు విగత జీవులుగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.
మరో మృతుడు ప్రవీణ్ సొంత గ్రామం గొంగుపల్లి కాగా, అమ్మమ్మ ఊరు అయిన మేడికొండలో ఎక్కువగా ఉంటాడు. ఏడాది క్రితమే అత ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం 8 నెలల కుమారు డు ఉన్నాడు. సొంత గ్రామం వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.