పలువురికి గాయాలు
నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి గాయాలైన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాదులోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ధర్పల్లి మండలంలోని లోలం గ్రామంలో విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని నిజామాబాదు వస్తుండగా డిచ్పల్లి వద్ద యూటర్న్ చేసుకుంటున్నా స్కూల్ బస్సును నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వస్తుండగా ఢీ కొట్టింది. ఆర్టీసీ బస్సులో ఉన్న కొందరికి, ప్రైవేట్ స్కూల్ బస్సులో ఉన్న కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులు స్పీడుగా లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్పల్లి పోలీసులు తెలిపారు.