లక్నో, అక్టోబర్ 28: తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ విద్యార్థులకు రూ.300 విలువైన చెక్కులను పంపిణీ చేయడంపై కాంగ్రెస్ ఫైరయ్యింది. అక్కడి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృత స్కాలర్షిప్ స్కీమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రోగ్రామ్కు సీఎం ఆదిత్యనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని సంస్కృత పాఠశాలలు, కాలేజీలు, యూనివరిటీల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.300 నుంచి రూ.900 ఉపకార వేతనాలను చెక్కురూపంలో పంపిణీ చేశారు. రూ.300లకే భారీ చెక్కు నమూనాను వినియోగించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు సైతం విమర్శలు చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత షమా మహ్మద్ స్పందిస్తూ ఈ చెక్కులను ప్రింటింగ్ చేయడానికి రూ.300 కంటే ఎక్కువ ఖర్చు చేసి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. యోగి ప్రభుత్వం విద్యార్థులను పబ్లిసిటీ కోసం వాడుకుంటుందని విమర్శించారు.