- లేనిపక్షంలో భూమికి బదులు భూమి ఇవ్వాలి
- భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితుల ధర్నా
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు శుక్రవారం భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. భూసేకరణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి దక్షిణం వైపున ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు చేసిన ప్రభుత్వం, తూర్పు వైపున మాత్రం కేవలం 22 కి.మీ మేరకే నిర్ణయించడాన్ని తప్పు పట్టారు.
ఇప్పటికే కాళేశ్వరం, జాతీయ రహదారులు, విద్యుత్, గ్యాస్ పైప్లైన్ల పేరిట సేకరించిన ప్రాంతాల నుంచే మరోసారి భూసేకరణ జరపడంతో అనేక మంది రైతుల బతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలైన్మెంట్ను మార్చకపోతే పరిహారం బదులుగా భూమికి బదులు భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.