ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నిందితులపై రౌడీ షీట్స్ తెరుస్తామని స్పష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుషాయిగూడ డిపో డ్రైవర్ ధరావత్ గణేశ్ను ఆయన శనివారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అప్జల్ గంజ్ నుంచి ఘట్కేసర్కు వెళ్తున్న రూట్ నంబర్ 231/1 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సును ఉస్మానియా యూనివర్శిటీ వై జంక్షన్ వద్ద శుక్రవారం రోడ్డుపై ఆపి డ్రైవర్పై ఆరుగురు దుండగులు విచక్షణ రహితం గా దాడి చేశారని తెలిపారు.
తీవ్ర గాయలవడంతో ఆయనను వెంటనే తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ది ఎలాంటి తప్పులేదని, బైక్లపై వచ్చి ఉద్దేశపూర్వకంగా దుండగులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే ఓయూ పోలీసులుస్పందించి దుండగులపై కేసు నమోదు చేశారన్నారు. ఐదుగురు దుండగులను శనివారం అరెస్ట్ చేశారని తెలిపారు.