హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రఖ్యాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ రంగం అభివృద్ధి, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, పెట్టుబడుల విస్తరణ పట్ల రోష్ని నాడార్ ఆసక్తి కనబర్చారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఇతర అధికారులు, హెచ్సీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.