ధోల్పూర్ : రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో శనివారం అర్థరాత్రి బస్సు, టెంపో ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు సహా 12 మంది మృతి చెందారు. గ్వాలియర్ నుంచి జైపూర్ వెళ్తున్న స్పీడ్ స్లీపర్ కోచ్ బస్సు సుమీపూర్ సమీపంలో టెంపోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని బారీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శివలహరి మీనా తెలిపారు. ఈ ప్రమాదంలో దంపతులు, ఎనిమిది మంది చిన్నారులు సహా 12 మంది మరణించారని తెలిపారు.
మృతులను ఇర్ఫాన్ అలియాస్ బంటీ (38), అతని భార్య జూలీ (34), కుమార్తె అస్మా (14), కుమారుడు సల్మాన్ (8), పర్వీన్ (32), జరీనా (35), సకీర్ (6), సానిఫ్ (9), అజాన్ (5), ఆషియానా (10), సూఫీ (7) మరియు డానిష్ (10) గా గుర్తించినట్లు ఆయన తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.