భిక్కనూరు: కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం సిద్దిరామేశ్వర్ నగర్ శివారులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కామరెడ్డి వైపు వస్తున్న ఓ కారు సిద్దిరామేశ్వర్ నగర్ శివారులోని సురేశ్ దాబాకి దగ్గరల్లో ఆగి ఉన్న లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. కారులో మృతుడు అతని భర్య, ఇద్దరు పిల్లలు, మరో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.