14-04-2025 11:27:12 PM
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) కూటమికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) బాయ్ బాయ్ చెప్పింది. ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు ఆ పార్టీ చీఫ్, మాజీ కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ సోమవారం ప్రకటించారు. తమ పార్టీ దళిత పార్టీ కాబట్టి అన్యాయం జరిగిందని, ఇప్పటి వరకు బీహార్ జేడీయూ, బీజేపీ ముఖ్యనేతలు ఎవరూ తమ పార్టీ గురించి వ్యాఖ్యానించలేదని పశుపతి ఆరోపించారు.
‘నేను 2014 నుంచి ఎన్డీయేతో పొత్తులో ఉన్నాను. ఈ రోజు ఆ కూటమి నుంచి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నా’ అని తెలిపారు. పార్టీ భవిష్యత్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘మహాగట్బంధన్ మాకు సరైన మర్యాద ఇస్తే మేము అందులో కొనసాగే విషయాన్ని ఆలోచిస్తాం’ అని తెలిపారు. పరాస్ ఈ యేడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ను చాలా సార్లు కలిశారు.
సీఎంపై కూడా విమర్శలు..
పరాస్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘నితీశ్ కుమార్ 20 ఏండ్ల పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది. ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. అవినీతి పెరిగిపోయింది.’ అని తెలిపారు.