12-04-2025 01:00:40 AM
ఖమ్మం, ఏప్రిల్ 11( విజయక్రాంతి ):-యాసంగి పంట కొనుగోలు సమయంలో మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం తరుగు తీయవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యాసంగి పంట కొనుగో లు ఖమ్మం జిల్లాలో ప్రారంభమైందని, జిల్లా లో 344 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 212 ధాన్యం కొనుగో లు కేంద్రాలను ఓపెన్ చేశామని, 25 కేంద్రా లు కొనుగోలు ప్రారంభించాయని, 13 కేంద్రాలలో ధాన్యం వివరాలు ఓపిఎంఎస్ లో నమోదు చేశారని తెలిపారు.
యాసంగి సీజన్ లో జిల్లాలో రైస్ మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ చేశామని, కొనుగోలు ప్రక్రియకు మిల్లర్లు సహకారం అందించాలని అన్నారు. కొన్ని రైస్ మిల్లులలో బస్తాకు నాలుగు కిలోల తరుగు తీస్తున్నట్లు సమాచారం అందుతుందని అన్నారు.
నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు పంపుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో తరుగు తీయడానికి వీలులేదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా సహకార అధికారి గంగాధర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.