calender_icon.png 2 April, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాది నుంచి ఆడబిడ్డలకు సన్నబియ్యం

21-03-2025 01:24:47 AM

-  పెనుబల్లి మండలం పర్యటనలో మంత్రి పొంగులేటి

-  రామ చంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపన

-  కల్లూరులోనూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం, మార్చి 20 ( విజయక్రాంతి ): :ఉగాది నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పెనుబల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపన చేశారు.

అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 15నెలలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ వ్యవధిలో మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చామని ఇందుకు గాను ఇప్పటి వరకు 5,450 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని పేర్కొన్నారు. రూ. 20,676కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు.

ఏడాదిలోనే 56వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. రూ. 500కే గ్యాస్ అందించిన ఘనత తమదేనన్నారు. తాజాగా మూడు రోజుల క్రితం రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో నూతన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా ఒక్కో నియోజక వర్గంలో సుమారు 4000మందికి పైగా ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ నిరుద్యో గులకు ఉపాధి అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 7లక్షల కోట్లకు పైగా అప్పులకు ప్రతినెల  రూ. 6500 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని తెలిపారు. ఆ కారణంగానే కొన్ని హామీలను అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లు పేదలకు ఇవ్వడం లక్ష్యమని తెలిపారు. తొలి విడతలో ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతుబంధు ఇచ్చామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500బోనస్ కూడా ఇచ్చామని తెలిపారు. ఇన్ని చేస్తున్నా ప్రతి పక్షాలు ఓర్వలేక తమ పై విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రామచంద్రపురంలో కొంతమంది రైతులు ఏళ్లుగా  ప్రభుత్వ అటవీ భూమిని సాగుచేసుకుంటున్నారని వాటికి ప్రభుత్వం తరుపున చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టేకులపల్లి గ్రామంలో అవిరామ్ సర్వీస్ స్టేషన్ ను ప్రారంభించారు. స్థానికంగా ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఓ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

అనంతరం ఎర్రబోయినపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ లకు శంకుస్థాపన చేశారు. పెద్దకోరుకొండి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ తో పాటు అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి ప్రసంగించారు.