18-04-2025 12:45:34 AM
* నేలకొండపల్లి మండలం నాచేపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు ప్రారంభించిన ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీజ
ఖమ్మం, ఏప్రిల్ 17 ( విజయక్రాంతి ):-భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు. గురువారం నేలకొండపల్లి మండలం నాచేపల్లి రైతు వేదికలో చేపట్టిన రెవెన్యూ సదస్సును ఇంచార్జ్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రత భావాన్ని తావియ్యకుండా జవాబుదారుతనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతాయని తెలిపారు. రైతులకు, అధికారులకు సులభంగా అర్ధం అయ్యేలా సామాన్య, గ్రామీణ ప్రజల, రైతుల సమస్య లు పరిష్కారం అయ్యేలా భూ భారతి చట్టం ఉందన్నారు.
హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు భూ భారతిలో అవకాశం ఉందన్నారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందన్నారు. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించిన మ్యూటేషన్ చేసి రికార్డులలో నమోదు చేయవచ్చన్నారు.భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టంలో రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు. భూదార్ కార్డుల జారీ జరుగుతుందన్నారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం లభిస్తుందని తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని, మోసపూరితంగా హక్కుల రికార్డులను మార్చి, ఎవరైనా ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం చట్టంలో ఉందన్నారు.
హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డులో లేనివారు హక్కుల రికార్డులో నమోదు చేయించు కోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరం లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ అన్నారు. గ్రామంలో చేపట్టిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు సంబంధించి 113 దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులకు అధికారులు, రశీదులు అందజేశారు.రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సందర్శించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
ఎన్ని దరఖాస్తులు వచ్చినవి, ఏ ఏ సమస్యలు ఎక్కువగా వస్తున్నవి అడిగి తెలుసు కున్నారు. రైతులకు చట్టంపై అవగాహన కల్పించి, వారి సమస్య పరిష్కారంపై భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్డీసి, పాలేరు నియోజక వర్గ ఇంచార్జ్ అధికారి ఎం. రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, నేలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.