calender_icon.png 24 October, 2024 | 3:59 AM

రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు

24-10-2024 01:58:47 AM

  1. డీపీఆర్ లేకుండానే మూసీలో కొబ్బరి నీళ్లు పారిస్తడట?
  2. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ లేకుండానే కొబ్బరి నీళ్లు పారిస్తానని చెబుతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు శనివారం, ఆదివారం వస్తే కంటి మీద కునుకు లేకుండా బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వ తీరును విమర్శించారు.

బుధవారం రామంతాపూర్ డివిజన్ ప్రగతినగర్, గోఖలే నగర్, బృందావన్ గార్డెన్స్ కాలనీలలో ఎంపీ ఈటల రాజేందర్ ఓపెన్ జిమ్‌లను ప్రారంభించారు. అనంతరం రామంతాపూర్, ఎల్‌బీ నగర్, చైతన్యపురి, నాగోల్, దిల్‌సుఖ్‌నగర్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజలు కేసీఆర్ పాలనతో విసిగిపోయి రేవంత్ రెడ్డికి పట్టం కట్టారని, కానీ ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 30 ఏళ్లుగా రెక్కల కష్టం చేసి కూడబెట్టుకున్న డబ్బుతో భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్న పేదలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు.  రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు.

నగరంలోని పేదలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పేదల ఇళ్లు కూలగొడితే సహించేది లేదన్నారు. పార్టీపరంగా రెండ్రోజుల పాటు ఈ ప్రాంతాల్లో సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే హరీశ్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్, డాక్టర్ ఎస్ ప్రకాశ్‌రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.