31-03-2025 06:58:20 PM
నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ అరెస్టులు చేస్తే ఊరుకునేది లేదు..
వేలం వేస్తున్న భూములలో జేసీబీలను, బుల్డోజర్లను వెనక్కి పంపాలి..
ఎస్ఎఫ్ఐ- పిడిఎస్యు భద్రాచలం డివిజన్ కమిటీల డిమాండ్..
భద్రాచలం (విజయక్రాంతి): హైదరాబాదులో విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణ కేంద్రంలోని సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రవీందర్, రామ్ చరణ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం, ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు రాష్ట్ర నాయకులు శివ ప్రశాంత్, భూపేందర్ హాజరై మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసిందని, నియంతృత్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాన్ని, అహంకారన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.
దానిలో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీకి చెందిన 400 ఎకరాల భూములని కర్పొరేట్ సంస్థలకు వేలం వేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు చేస్తున్న విద్యార్థుల పట్ల అలాగే యూనివర్సీటీ భూములు తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్న సమాజం పట్ల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మత్రి శ్రీధర్ బాబు అత్యంత దురుత్సాహకరమైన రీతిలో వ్యవహరించి వాఖ్యలు చేశారు. ఈ రోజు ఆ నాలుగు వందల ఎకరాలలో ఏమీ లేదని నిరూపించుకోవటం కోసం అక్కడున్న ఫారెస్టును తొలగించి భూములన్నింటినీ హద్దులు లేకుండా చెరిపివేయాలే పేరుతో జీవవైవిద్యాన్ని దెబ్బతీసేందుకు, మొక్కలను తొలగించటం కోసం జేసీబీలను బుల్డోజర్లను తీసుకుని వచ్చారు.
ఈ సందర్బంగా పోలీసు బలగాలను దింపి, బారీగేట్లను ఏర్పాటు చేయటంతో విద్యార్థులు తమ భూములను కాపాడుకోవటం కోసం ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి సుమారు 60 మందికి పైగా రాయ్దుర్గ్, మాధాపూర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారితో పాటు మరో 200 మందిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత అవమానకరమైన ఘటన. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ఎవరైనా వచ్చి ముఖ్యమత్రిని కలసి సమస్యలు చెప్పుకోవచ్చని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ రోజు విద్యార్థులని చూడకుండా అమ్మాయిలని చూడకుండా, జుట్టు పట్టి మరి, గాయాలు చేసి, లాక్కుని పోయి, నిర్బందాన్ని ప్రయోగిసూ పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ వ్యాన్లలో ఎత్తేవేస్తూ అరెస్టు చేయటాన్ని ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు భద్రాచలం డివిజన్ కమిటీ తీవ్రంగా అందిస్తున్నాయి. ఈ చర్యలు చేయటమంటేనే ప్రజాస్వామ్యం లేకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.
తక్షణమే ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. యూనివర్సీటీలో దింపిన పోలీస్ బలగాలను వెనక్కి పిలిపించాలి. జేసీబీ, బుల్డోజర్లను అక్కడి నుండి ఖాళీ చేయించాలి. హెచ్సీయూకు చెందిన భూముల వేలాన్ని అపాలని ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు కోరుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ రోజు భద్రాచలం పట్టణంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేయటాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపారు. వేలం వేసిన భూముల సర్కులర్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో విద్యార్థుల తరపున ముఖ్యమత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్బంగా హెచ్చరిస్తున్నాము. ఈ ఘటనలనీ, నిర్బంధాలనీ, నియంతృత్వాన్ని ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు ఖండించాలని ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు జిల్లా కమిటి కోరుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు నాయకులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.