05-03-2025 12:17:12 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి4 (విజయ క్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలే చెంపపెట్టు అని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బిజెపి మద్దతుదారుడు కొమరయ్య గెలుపొందడంతో మంగళవారం జిల్లా కేంద్రంలోనీ అంబేద్కర్ చౌక్ వద్ద ఆ పార్టీ సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వరరావుతో కలిసి సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కొట్టి ,స్వీట్లు పంపించేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగులతో పాటు ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని తెలిపారు. అభివృద్ధి చేయడం పక్కనపెట్టి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆధిపత్యం కోసం పాకులాడుతు న్నారని ఎద్దేవా చేశారు. దేశంలో మోడీ చేపడుతున్న సంస్కరణలకు ప్రజలు ఆసక్తి చెంది బిజెపి వైపు చూస్తున్నారన్నారు. భావితరాల భవిష్యత్తు కు దారులు వేసే ఉపాధ్యాయులు ఎంతో ముందు చూపుతో బిజెపి అభ్యర్థికి పట్టం కట్టారని పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బిజెపి గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్, నాయకులు చర్ల మురళి, పెంటయ్య, ప్రసాద్, ప్రహ్లాద్, వెంకన్న పాల్గొన్నారు.