calender_icon.png 24 March, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

22-03-2025 11:45:02 PM

కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, రిజర్వేషన్లు అమలు చేయిస్తాం

త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం: ఆర్.కృష్ణయ్య, రాజారాం యాదవ్

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): కులగణన లెక్కల ఆధారంగా తక్షణమే స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘బీసీ బిల్లు-స్ధానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో తక్షణమే రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమ కార్యాచరణ‘ అనే అంశంపై బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలను మోసం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైకి నెడుతోందని విమర్శించారు.

కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయాలంటే కులాలు, సంఘాలు, పార్టీలకు అతీతంగా బీసీ వర్గాలన్నీ ఒక్క తాటిపైకి రావాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లను అమలు చేసే బాధ్యత నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పాట పాడుతున్నారని ఆరోపించారు. కొంతమంది తాబేదారులను పెట్టుకొని సన్మానాలు, చప్పట్లు కొట్టించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు బీసీ ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.  త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సామాజిక ఉద్యమకారుడు విజిఆర్ నారగోని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని మరోసారి నిరూపించుకుందని అన్నారు.

స్వాతంత్య్రం నుంచి బీసీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ కి పార్టీకి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వరులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త పోటీ పరీక్షల అధ్యాపకుడు అశోక్ , ఎంబిసి కులాల జాతీయ కన్వీనర్ కొండూరి సత్యనారాయణ, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రాంకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి గౌడ్, పద్మశాలి సంఘం నాయకులు శ్రీనివాస్ నేత, టి.జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ,  బీసీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.కర్నాటి శ్రీనివాస్, అంబేద్కర్ ఆజాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగర నరహరి,  విద్యార్థి, నిరుద్యో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి తదితరులు పాల్గొన్నారు.