23-03-2025 12:00:00 AM
త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం: ఆర్.కృష్ణయ్య, రాజారాం యాదవ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22(విజయక్రాంతి) : కులగణన లెక్కల ఆధారంగా తక్షణమే స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘బీసీ బిల్లు-స్ధానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో తక్షణమే రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమ కార్యాచరణ‘ అనే అంశంపై బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావే శానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. బీసీలను మోసం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైకి నెడుతోందని విమర్శించారు.
కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లను అమలు చేసే బాధ్యత నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పాట పాడుతున్నారని ఆరోపించారు.
కొంతమం ది తాబేదారులను పెట్టుకొని సన్మానాలు, చప్పట్లు కొట్టించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు బీసీ ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. సా మాజిక ఉద్యమకారుడు విజిఆర్ నారగోని, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వరులు, విద్యావేత్త పోటీ పరీక్షల అధ్యాపకుడు అశోక్, ఎంబిసి కులాల జాతీయ కన్వీనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.