17-03-2025 05:11:07 PM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం హర్షం..
9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్..
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం..
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇది రాష్ట్రంలో దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించేందుకు పోరాటం చేస్తున్న అన్ని బీసీ సంఘాల సమిష్టి విజయమని బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్న వారందరికీ ఇది గర్వకారణం అని అన్నారు.
ఈ బిల్లు ద్వారా స్థానిక సంస్థలు, విద్యా ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగనుండటం ఒక చారిత్రక ముందడుగు అని, ఇది దేశవ్యాప్తంగా బీసీ సామాజిక న్యాయ ఉద్యమానికి బలాన్ని చేకూర్చే మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరుతూ ఈ నెల 19వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుజ్జ సత్యం తెలిపారు. 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు న్యాయస్థానాల్లో ఆటంకాలకు అవకాశమున్నందున, దీన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో అఖిలపక్ష ఎంపీల మద్దతు కూడగట్టడానికి ఛలో పార్లమెంట్ ను 19వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చట్టసభలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యుస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో బీసీలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు.