మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఇటీవల ఖమ్మంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న కాలువలకు ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య కోరారు. శుక్రవారం మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ కోదాడలో సాగర్ ఎడమ కాలువకు రిపేర్ చేయడం లేదని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ పనులు జరగడంలేదని మండిపడ్డారు. పంటకు నీళ్లు అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు హెలికాప్టర్లపై చక్కర్లు కొడుతూ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ రాష్ర్టంలో ప్రజలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పాలనతో ఇబ్బంది పడుతున్నారని, కాంగ్రెస్ హామీలను నమ్మి మోసం పోయాం అంటూ బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువా నదుల్లో నీళ్లు లేవని, బోరు బావిలపైనే జనం ఆధార పడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. భూగర్భజలాలు తగ్గుతున్నాయని తిరిగి ఫ్లోరైడ్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు.