10-04-2025 10:21:44 PM
ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు..
కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడి..
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): సహకార సంఘ మార్గదర్శకాలు ప్రామాణికంగా సహకార సంఘాల పునర్విభజన చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో సహకార సంఘాలు పునర్విభజనపై రెవెన్యూ, సహకార, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశు సంవర్ధక, వరంగల్, కరీంనగర్ డిసిసిబి డిజిఎం, ఎజిఎంలతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహకార సంఘం మార్గదర్శకాల. మేరకు 10 అంశాలను పరిగణనలోకి తీసుకుని10 నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. సహకార సంఘాలు ఏర్పాటు ద్వారా అన్ని గ్రామాల రైతులకు ప్రయోజనం కలగాలని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న సహకార సంఘాలు సుదూరం ఉన్నందున ప్రజలకు సేవలు అందించడానికి ఇబ్బందులు వస్తున్నాయని, అట్టి ఇబ్బందులు గమనంలోకి తీసుకుని నూతన సహకార సంఘాలు ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. నూతన సంఘాలు ఏర్పాటులో మూడు సంవత్సరాలు పాటు జరిగిన వ్యాపార లావాదేవీలు, ఆడిట్ నివేదికతో పాటు 9 అంశాలను తుచ తప్పక పరిగణలోకి తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ సూచించారు.
సహకార సంఘాలు ఏర్పాటు ద్వారా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీలు అందించి రైతుల ఆర్థికాభివృద్ధికి సహకారాన్ని అందించేందుకు బహుళ ప్రయోజన సహకార సంఘాలు ఏర్పాటు అవశ్యత అవసరమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సహకార శాఖ అధికారి వాల్యనాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి డా కుమారస్వామి, వ్యవసాయ శాఖ ఎడిఏ బాపు, ఉద్యాన అధికారి సునీల్, మత్య్స శాఖ అధికారి విజయ్ కుమార్, నాబార్డు డిడిఎం చైతన్యరవి, కరీంనగర్, వరంగల్ డిసిసిబి సీఈఓలు సత్యప్రసాద్, వజీర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.