ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితుల ఫోన్లో రాజాసింగ్ ఫొటోతో పాటు గన్, బుల్లెట్ల ఫొటోలు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : బీజేపీ ఫైర్బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం గోషామహల్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద బోర బండకు చెందిన షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిచడంతో స్థానికులు వారిని పట్టుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిద్దరు ఎమ్మెల్యే ఇంటిపై రెక్కీ నిర్వహించేం దుకు వచ్చినట్లు అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న మంగళ్హాట్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాగా, ఇద్దరి మొబైల్ ఫోన్లలో రాజాసింగ్ ఫోటోతో పాటు గన్, బుల్లెట్ల ఫోటోలు ఉండడంతో రాజాసింగ్ గురించిన విషయాలను ఎవరికైనా చేరవేయడానికి వచ్చారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
అయితే నిందితులిద్దరూ రాజాసింగ్ ను నేరుగా కలిసి తమ గోడు వెల్లబోసుకోవడానికి వచ్చినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, వారి వద్ద గన్, బుల్లెట్లు లభ్యమయ్యయని సోషల్ మీడియాలో పెత్త ఎత్తున ప్రచారం జరిగింది. అదంతా అవాస్తవమని మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ మహేశ్ పేర్కొన్నారు.
ఇలాంటి వాటికి భయపడను : రాజాసింగ్
తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని నగర పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. అయినా ఇటువంటి వాటికి తాను భయపడనని రాజాసిం గ్ స్పష్టం చేశారు. తన మీద రెక్కీ నిర్వహించి ముంబాయిలోని కొంతమందికి సమాచారం చేరవేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.