08-04-2025 01:30:56 AM
ఇంజినీరింగ్ విభాగంలో స్క్రీనింగ్ టెస్ట్
పీహెచ్డీ ఉంటే 10 మార్కులకు, లేకుంటే 20 మార్కులకు పరీక్ష
కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): రాష్ర్టంలోని 12 యూనివర్సిటీల్లో ఇంజినీరిం గ్ కోర్సులను బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్ట్ను నిర్వహించనున్నారు. పోస్టుల భర్తీ కో సం ప్రభుత్వం నూతన మార్గదర్శకాలకు సం బంధించి జీవో నెం.21ని జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ కోర్సులను బోధించేందుకు దరఖాస్తు చేసుకునే అసిస్టెంట్ ప్రొఫెస ర్లు ఇప్పటికే పీహెచ్డీని పూర్తి చేసి ఉంటే వారికి 10 మార్కులకు, పీహెచ్డీలేని వారికి 20 మార్కులకి పరీక్షను నిర్వహించాలని పేర్కొన్నారు. మిగిలిన సంప్రదాయ సబ్జెక్టులు బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మాత్రం ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించరు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూ జీసీ) నిబంధనల ప్రకారం జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఉన్న వారికి 10 మార్కులు వెయిటేజీ, నెట్, సెట్, స్లెట్ ఉంటే 5 మార్కు లు, పీహెచ్డీకి 10 మార్కులు, ఎంఫిల్ ఉంటే 5 మార్కులు, పరిశోధన పత్రాలు, సదస్సులు నిర్వహించిన వారికి గరిష్ఠంగా 5 మార్కులను కేటాయిస్తారు. అయితే ఇంజినీరింగ్లో నెట్, సెట్, పీహెచ్డీ చేసిన వారు తక్కువగా ఉం టారు. ఈ నేపథ్యంలోనే పీహెచ్డీ చేసిన వారి కి స్క్రీనింగ్ టెస్ట్లో 10 మార్కులు వెయిటేజీ ఇవ్వాలని.. మరో 10 మార్కులకి పరీక్షను నిర్వహించాలని మార్గదర్శకాలు రూపొందించా రు. పీహెచ్డీలేని వారికి 20 మార్కులకి పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు.
రాష్ర్టం లోని జేఎన్టీయూతోపాటు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ కోర్సు లు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి శాతవాహన యూనివర్సిటీకి కూడా ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈయూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కోర్సులను బోధించేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను ప్రభుత్వం చేపట్టబోతోంది. ఇంజినీరింగ్ కోర్సులను బోధించ డానికి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు తొలుత బిటెక్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించగా.. ఆ తరువాత ఎంటెక్ చేసిన వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు నూతన మార్గదర్శకాలను జారీ చేశారు.
రిక్రూట్మెంట్ బాధ్యతలు వర్సిటీలకే
వర్సిటీల్లోని ఖాళీల భర్తీ బాధ్యతలను యూనివర్సిటీలకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఏ వర్సిటీలోని ఖాళీలను ఆ వర్సిటీయే నోటిఫికేషన్లను జారీ చేసి నియామకాలను చేపట్టనుంది. ఈ నియామకాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అటకెక్కడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత వర్సిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. తర్వాత పదోన్నతులుపోనూ అసోసియేట్, ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనుంది. విభాగాల వారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలను సేకరించి ఆతర్వాత ఏ వర్సిటీకి ఆ వర్సిటీ వేర్వేరుగా నోటిఫికేషన్లను జారీ చేయనుంది.
అయితే అన్ని వర్సిటీలు ఒకేసారి నోటిఫికేషన్లు వేయకుండా నోటిఫికేషన్ల మధ్య కొన్ని నెలలు గడువుండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. గత ప్రభుత్వ హయాంలో 1060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2,817 బోధన పోస్టులు మంజూరు ఉండగా, అందులో 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మొత్తం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,524 ఉంటే 1061 పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. వీటిలో తొలుత డిమాండ్ కోర్సులకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసి, తర్వాత మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి.