* జనవరిలో 15,205 మెగావాట్ల విద్యుత్ అవసరాలు
* వేసవిలో మరింత ఎక్కువగా డిమాండ్
* రాష్ట్ర విద్యుత్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా
హైదరాబాద్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): జనవరిలో విద్యుత్ డిమాండ్ రికార్డ్ స్థాయిలో 15,205 మెగావాట్లకు చేరిందని, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తం వ్యవహరించాలని రాష్ట్ర విద్యుత్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సూచించారు.
హైదరాబాద్లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో శనివారం విద్యుత్శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది జనవరితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో హెచ్చుస్థాయిలో విద్యుత్ డిమాండ్ ఉందని వెల్లడించారు.
దీన్నిబట్టి వేసవిలో పీక్ డిమాండ్ 17,000 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని, అప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. వేసవిలో వ్యవసాయ రంగంలోనూ విద్యుత్ వినియోగం ఉంటుందని, పంటలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సూచిం చారు.
అందుకు ప్రతి జిల్లాకూ ఒక సీనియర్ ఇంజినీర్ను నోడల్ అధికారులుగా నియమించాలని ఆదేశించారు. సమావేశంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, డైరెక్టర్లు నర్సింహులు, నందకుమార్, సాయిబాబా, సుధా మాధురి, చీఫ్ ఇంజినీర్లు పాండ్య, బాలస్వామి, ఆనంద్, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.