04-03-2025 12:24:59 AM
జగిత్యాల, మార్చి 3 (విజయక్రాంతి): ఉన్న ఊరిలో ఉపాధి కరువై, గల్ఫ్ దేశాల బాట పట్టి ప్రమాదవశాత్తు అక్కడ చనిపోయిన ప్రవాసి భారతీయుల కోసం రాష్ర్ట ప్రభుత్వం ‘గల్ఫ్ భరోసా’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదరించి, చేయూతనిచ్చే దిశలో ప్రభుత్వం పావులు కదుపు తోంది. ఈ క్రమంలోనే 94 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4 కోట్ల 70 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా సొమ్ము వారి ఖాతాలకు ఈనెల ఒకటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జమ చేసింది.
తెలంగాణ రాష్ర్ట మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఇటీవల సీఎంకు వినతి చేసిన క్రమంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్’లో త్వర లో ‘గల్ఫ్ అమరుల సంస్మరణ సభ’ ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆలోచిస్తోంది.
గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్’రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని వారికి భరోసా ఇవ్వనున్నారని అనిల్ సోమ వారం పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు స్పందించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ ధన్యవాదాలు తెలిపారు. గల్ఫ్ కార్మికులు ఆయురారోగ్యాలతో, క్షేమంగా మాతృ భూమికి తిరిగి రావాలని కాంగ్రేస్ ప్రభుత్వం ఆశిస్తున్నది.
కానీ దురదృష్ట వశాత్తు గల్ఫ్ దేశాలలో అకాల మరణం పొందిన మన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన తెలిపారు.
భారత దేశ సరిహద్దులు దాటి ఎడారి దేశాలలో పనిచేస్తూ, మృతి చెందిన కార్మికులు సైనికుల లాంటి వారని, విదేశీ మారక ద్రవ్యం పంపిస్తూ ఆర్థిక జవాన్లుగా సేవలందించిన వారిని ‘గల్ఫ్ అమరులు’గా స్మరించుకొని వారిని గౌరవించడం కోసం సీఎం ఈ ‘గల్ఫ్ భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అనిల్ వివరించారు.
మొత్తం మీద గల్ఫ్ మృతుల కుటుంబాల నిరీక్షణ నెరవేరి, ప్రభుత్వ పక్షాన కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందడం పట్ల సదరు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.