08-04-2025 12:56:46 AM
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): గ్రీన్పవర్, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పునర్జీవం, విద్యారంగాలను బలోపేతం చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్పాంగ్ మాట్లాడుతూ తెలంగాణతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తమ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సింగపూర్ సంస్థలతో కలిసి పని చేసే అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
కొత్త గ్రీన్పవర్ పాలసీలో భాగంగా సోలార్, హైడ్రో, పంపుడ్ స్టోరేజీ విభాగాలపై దృష్టి పెట్టామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్టు సింగపూర్ ప్రతినిధి బృందానికి వివరించారు.
మొదటి దశలో రూ.600 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశామని, ప్రతీ పాఠశాలను 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్గా చేపడుతున్నామన్నారు. తెలంగాణలో పట్టణాలు ఉన్నాయని వాటిపైనా దృష్టి సారించామన్నారు. సమావేశంలో సింగపూర్ పొలిటికల్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్, సింగపూర్ హై కమిషన్ ప్రథమ ఆర్థిక సెక్రటరీ, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు.