వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం..
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఏలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు విద్య కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని జిఎంఆర్ సేవా సమితి ద్వారా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ... విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని, పదవతరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని, విద్యార్థులకు మంచి విద్యాబోధన అందుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా, పాఠ్యపుస్తకాల నుండి క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ క్లాసులకు అనుసంధానమయ్యేలా నిపుణులైన అధ్యాపకులతో తన సొంత నిధులతో స్టడీ మెటీరియల్ తయారు చేయించడం జరిగిందన్నారు. ఈ స్టడీ మెటీరియల్ ను మండల విద్యార్థులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని 10 తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, విద్యా కమిటీ మెంబర్స్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.