04-04-2025 08:27:26 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఎల్లారెడ్డి మండల ప్రత్యేక అధికారి, ఆర్డిఓ మన్నె ప్రభాకర్ తనిఖీ చేశారు. గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం గ్రామ శివారులోని నర్సరీని సందర్శించి మొక్కలకు నీళ్లు పోశారు. ఈ వేసవికాలంలో ఎండల తీవ్రతకు మొక్కలు వాడిపోకుండా మొక్కలకు విరి విగా నీరు అందించాలని, నర్సరీలోని మొక్కలను ప్రత్యేక శ్రద్ధతో సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్, గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.