బీఆర్ఎస్ తరఫున గెలిచి స్వప్రయోజనాల కోసం అధికార కాంగ్రెస్లోకి జంపైన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు తాము ఏ పార్టీ ఎమ్మెల్యేలో చెప్పుకోవడానికి జుట్టు పీక్కుంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ప్రభుత్వ పెద్దలు వారిని దూరం పెట్టారు.
పీఏసీ చైర్మన్ పదవీ అరికెపూడి గాంధీకి ఇవ్వడంతో వారంతా బీఆర్ఎస్ నేతలేనని మంత్రులు చెప్పుకొస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్కు ఎందుకు రావడం లేదని గులాబీ పార్టీ సీనియర్లు నిలదీస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జంప్జలానీల పరిస్థితి కుడితితో పడ్డ ఎలుకలా తయారైంది.
ఏ పార్టీ కండువా వేసుకోవాల్లో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో పర్యటనలు చేపట్టాలంటే కాంగ్రెస్ క్యాడర్ రావడంలేదు. బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజల ముందుకు ఎలా వెళ్లాలా అని సమాలోచనలు చేస్తూ ఫామ్ హౌస్లకే పరిమితమవుతున్నారు.