హైదరాబాద్: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతిపట్ల వ్యాపార, రాజకీయ, సినీప్రముఖులు నివాళులర్పించారు. ఎన్సీపీఏ మైదానంలో రతన్ టాటా పార్థివదేహానికి సచిన్ తెందూల్కర్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతా దాస్, ఎన్సీపీ-ఎస్సీపీ అధినేత శరధ్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నివాళులర్పించారు. రతన్ టాటా మరణం పట్ల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం తెలిపారు. రతన్ టాటా లేరన్నది అంగీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ సంతాపం తెలిపారు. రతన్ టాటా ఎందరికో స్ఫూర్తిదాయకం అన్నారు. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రతన్ టాటా మృతిపై స్పందిస్తూ దేశ పారిశ్రామికాభివృద్ధికి చుక్కానిలా నిలిచిన మహనీయుడు రతన్ టాటా అని కొనియాడారు.
దేశాభివృద్ధికి రతన్ టాటా ఎన్నో అవకాశాలు సృష్టించారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రతన్ టాటా మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రతన్ టాటా మృతి దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరనిలోటన్నారు. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రతన్ టాటా భారత పారిశ్రామికాభివృద్ధికి పర్యాయపదం అని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. తాను కూడా టాటా కట్టించిన విద్య సంస్థలోనే చదువుకున్నానని ఎస్ సోమనాథ్ వెల్లడించారు. అటు రతన్ టాటా మరణంపై కేరళ ముఖ్యంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు.
రతన్ టాటా మృతికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సంతాపం తెలిపింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలిపారు. రతన్ జీ మరణం తీరని టోటని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి తెలిపారు. ఆయన సహనశీలురు అన్నారు. ఇతరుల పట్ల ఎంతో శ్రద్ధ, కరుణ చూపిస్తారని గుర్తుచేసుకున్నారు. అలాంటి మరో వ్యక్తి తనకు తారసపడలేదని సుధామూర్తి వెల్లడించారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, ప్రియాంక చోప్రా జోనాస్, దిల్జిత్ దోసాంజ్, ఎస్ఎస్ రాజమౌళి టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి సంతాపం తెలిపిన ప్రముఖ సినీ ప్రముఖులలో ఉన్నారు. రతన్ టాటా బుధవారం అర్థరాత్రి ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.