22-03-2025 08:57:14 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పిఎస్ఆర్ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. శనివారం పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హాజరై దాదాపు 500 మందికి ముస్లిం నిరుపేదలకు రంజాన్ పండగకు కావలసిన నిత్యావసర వస్తువులు, బియ్యం తదితర సామాగ్రిని ఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ.. మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజులపాటు ఎంతో నియమనిష్ఠలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులు అవుతారన్నారు.
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని అన్నారు. ముస్లింలు అతిపవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు అనేక దైవకార్యాలు చేస్తారని, ప్రతిరోజూ ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని, ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాను ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకం అని ఆయన పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగగా రంజాన్ జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు, తదితరులు పాల్గొన్నారు.