calender_icon.png 1 October, 2024 | 6:46 AM

మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్ మైనపు విగ్రహం

30-09-2024 12:30:15 AM

హీరో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయిన అతనికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న రామ్‌చరణ్ ఇప్పుడు మరో అరుదైన ఘనత అందుకోనున్నారు.

ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. అతని పెట్ డాగ్ రైమీ విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటుచేయనుండడం విశేషం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయ్యిందని తాజాగా జరిగిన ఐఫా వేదక మీద మేడమ్ టుస్సాడ్స్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన రామ్‌చరణ్ మేడమ్ టుస్సాడ్స్ ఫ్యామిలీలో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది. టాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ల మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరాయి.

అయితే రామ్‌చరణ్ మైనపు విగ్రహం విషయంలో మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. మేడమ్ టుస్సాడ్స్ పుట్టినిల్లుగా లండన్ మ్యూజియానికి చరిత్ర ఉంది. ఇప్పుడు అక్కడ అడుగుపెడుతున్న మొదటి తెలుగు హీరోగా రామ్‌చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు.

ప్రభాస్ (బ్యాంకాక్ మ్యూజియం), మహేశ్‌బాబు (సింగపూర్), అల్లు అర్జున్ (దుబాయ్)లో మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.