calender_icon.png 25 October, 2024 | 5:02 AM

ఏ1గా రాజ్‌తరుణ్

12-07-2024 01:12:49 AM

ఏ2 మాల్వీ, ఏ3 మాయాంక్

కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు

రాజ్‌తరుణ్ నావద్ద 70 లక్షలు తీసుకున్నాడు

డబ్బులు వద్దు.. అతనే కావాలి

రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య

రాజేంద్రనగర్, జూలై 11 : సినీనటుడు రాజ్‌తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో అతడిపై లావణ్య ఫిర్యాదు చేసి ఇటీవల తగిన ఆధారాలు నార్సింగి పోలీసులకు సమర్పించడంతో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు చేశారు. అతడిని ఏ1గా చేర్చిన పోలీసులు తాజాగా ఏ2గా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఏ3 ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో వీరి ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు.

రాజ్‌తరుణ్ తనకు 2016లో అబార్షన్ చేయించా డని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను సైతం ఆమె నార్సింగి పోలీసులకు అందజేసింది. తాను మరోపేరుతో రాజ్‌తరుణ్‌తో కలిసి విదేశాలకు సైతం పలుమార్లు వెళ్లినట్లు లావణ్య తెలిపింది. రాజ్‌తరుణ్ వద్ద కుక్కలు ఉండటంతో తాము గతంలో 6 ఇళ్లు మారినట్లు పేర్కొంది. అతడికి ఉన్న సుమారు 70 లక్షల అప్పులు కూడా తీర్చినట్లు వెల్లడించింది. తనకు మొదటగా రాజ్‌తరుణే ప్రపోజ్ చేసినట్లు వివరించింది.

ఈ వ్యవహారంలో తనకు కేవలం రాజ్‌తరుణ్ మాత్రమే కావాలని, అతడి నుంచి డబ్బులు ఏమాత్రం అవ సరం లేదని చెప్పింది. మాల్వీ తమ జీవితాల్లో నుంచి వెళ్లిపోవాలని కోరింది. రాజ్‌తరుణ్‌ను తాను దక్కించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తానని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రాజ్‌తరుణ్, లావణ్య వ్యవహారంలోకి తనను అనవసరంగా లాగారని మాల్వీ మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ మాత్రం సంబంధం లేని తన సోదరుడు మయాంక్‌ను కూడా లాగి తమ పరువుకు నష్టం కలిగించిందని ఆరోపించింది.