calender_icon.png 21 September, 2024 | 12:03 AM

రాజ్‌తరుణ్ నిందితుడే

07-09-2024 12:11:03 AM

  1. లావణ్యతో సహజీవనం నిజమే
  2. చార్జిషీట్‌లో పేర్కొన్న నార్సింగి పోలీసులు 
  3. ఈ కేసులో ఇప్పటికే రాజ్‌తరుణ్‌కు ముందస్తు బెయిల్

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 6: హీరో రాజ్‌తరుణ్ కేసు మరో మలుపు తిరిగింది. లావణ్యతో రాజ్‌తరుణ్ పదేళ్ల పాటు సహజీవనం చేశాడని నార్సింగి పోలీసులు శుక్రవారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. తనను రహస్యంగా ఓ ఆలయంలో వివాహంచేసుకున్నాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాము ఒకే ఇంట్లో కాపురం చేశామని, ఈ క్రమంలో తాను గర్భం దాల్చానని, తనకు రాజ్‌తరుణ్ అబార్షన్ కూడా చేయించాడని లావ్యణ సంచలన ఆరోపణలు చేసింది.

అందుకు సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు అందించింది. రాజ్‌తరుణ్‌తో కొన్నిరోజుల క్రితం కలిసి నటించిన నటి మాల్వీ మల్హోత్రా తనను బెదిరించారని, ఆమెతో పాటు ఆమె సోదరుడితో తనకు ప్రాణహాని ఉందని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాల్వీ మల్హోతా కూడా లావణ్యపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లావణ్య తన నివాసంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. 

రాజ్‌తరుణ్‌పై వ్యతిరేక పోరాటం కాదు: లావణ్య

రాజ్‌తరుణ్‌పై చార్జిషీట్ దాఖలుపై లావణ్య స్పందించారు. చివరకు న్యాయమే గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇది రాజ్‌తరుణ్‌కు వ్యతిరేక పోరాటం కాదని స్పష్టం చేశారు. ఈ కేసులో ఆయన శిక్ష అనుభవించాలని తాను కోరుకోవడం లేదని, తనకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.

రాజ్‌తరుణ్ తన నుంచి దూరంగా వెళ్లిన తర్వాత తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. శేఖర్ అనే వ్యక్తిని కొందరు అస్త్రంగా ప్రయోగించి తనపై లేనిపోని ఆరోపణలు చేయించారని ఆరోపించారు. మాల్వీ మల్హోత్రా కోసం రాజ్‌తరుణ్ తనను వదిలించుకోవాలని చూశారని, కేసును తప్పుదోవ పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు.