ఆందోళనలో అభిమానులు
సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన సెప్టెంబర్ 30న సాయంత్రం నలతగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. గుండె నుంచి రక్త ప్రసరణ అయ్యే నాళాల్లో వాపు గుర్తించిన డాక్టర్లు, వెంటనే వైద్యం అందించడం ప్రారంభించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీశ్ ఆధ్వర్యంలో రజనీకాంత్కు శస్త్ర చికిత్స జరిగింది.
నాన్ సర్జికల్ పద్ధతుల ద్వారా ఆయనకు స్టెంట్ వేశారు. ఇదిలా ఉండగా, రజనీ సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసి అభిమానులు ఆందోళన చెందారు. అయితే మంగళవారం చికిత్స అందించిన తర్వాత వైద్యులు శుభవార్త చెప్పారు. రెండు రోజుల్లో రజనీకాంత్ను డిశ్చార్జి చేస్తామని వారు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు.
దీంతో తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు వేడుకుంటున్నారు. రజనీ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. టీఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ‘వేట్టయన్’ అక్టోబర్ 10న దసరా కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ బుధవారం రిలీజ్ చేయనున్నారు.
తలైవా నటిస్తున్న మరో సినిమా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘కూలీ’. ప్రస్తుతం ఇది సెట్స్పై ఉంది. రజనీ కోలుకున్న తర్వాత మళ్లీ చిత్రీకరణ ప్రారంభిస్తారు. అప్పటి వరకూ హీరో అవసరం లేని సన్నివేశాలను షూట్ చేయడానికి లోకేశ్ ప్లాన్ చేస్తున్నారట.