calender_icon.png 5 October, 2024 | 8:48 PM

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి పట్ల చిరంజీవి సంతాపం

05-10-2024 05:00:08 PM

పార్థివ దేహానికి నివాళులర్పించిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు....

కూకట్ పల్లి : సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఆయన కూతురు గాయత్రికి (38) గుండెనొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగానే తుది శ్వాస విడిచింది. గాయత్రి కి భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు. భర్త కార్ల వ్యాపారం చేస్తున్నడు. కూతురు సాయి తేజస్విని చైల్డ్ ఆర్టిస్ట్. చిన్న వయసులోనే కూతురు కళ్ళముందే మృతి చెందడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కూతురు మరణం తట్టుకోలేక ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

గాయత్రి పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి కూకట్‌పల్లి కెపిహెచ్బి కాలనీలోని ఇందు ఫార్చ్యూన్ విల్లా 226లో సందర్శన కోసం తీసుకొచ్చారు. రాజేంద్రప్రసాద్ కూతురు మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన నివాసానికి తరలివచ్చి పార్థివ దేహానికి నివాళులర్పించి రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో సినీ ప్రముఖులు చిరంజీవి దంపతులు, అల్లు అర్జున్, త్రివిక్రమ్, నాగ అశ్విన్, వెంకటేష్, రఘుబాబు తోపాటు పలువురు సినీ రంగానికి చెందినవారు ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం కె.పి హెచ్బి కాలనీ ఏడవ ఫేజ్ వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.